సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. నీటిని
సక్రమంగా తీసుకుంటే ఒబేసిటీ రాదంటారు. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని
ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలా అని ఎప్పుడుపడితే అప్పుడు నీటిని సేవించినా ప్రమాదమే
అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు, ఆ తర్వాత...
ఆహారం తీసుకునే అరగంట ముందు ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేస్తే బరువు
తగ్గుతారు. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నీటిని సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు
చెబుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే పొట్ట నిండేలా నీటిని సేవిస్తే.. అజీర్తి సమస్యలు
తలెత్తుతాయట. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీటిని తాగకూడదట. నీటికి బదులు మజ్జిగ
తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఇది ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఆకలిగా
ఉన్నప్పుడు కాసిన్ని నీరు సేవించండి. పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకోండి. ఇలా చేయడం
ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చని వెల్లడించారు.
ఇక పరగడుపున రెండు గ్లాసుల నీటిని తీసుకుంటే శరీరానికి శక్తి చేకూరుతుంది.
ఇలా రోజూ చేస్తే శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. నీరసంగా ఉన్నప్పుడు మన మెదడులో నీరు
75 శాతం మాత్రమే ఉందని గమనించాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినన్ని నీరు సేవించాలి.
నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా నీటిని సేవించడాన్ని మరిచిపోకూడదు.
అయితే సాయంత్రం పూట తక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు
వ్యాయామానికి అనంతరం నీటిని తీసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి.
అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు నీటిని సేవించడం మంచిది. గర్భిణిలు, బాలింతలు
అధికంగా నీటిని తీసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు
అంటున్నారు. మిగిలిన వారు రోజుకు 8 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.