News and Entertainment

గాడిద గుడ్డు కధ

జోగులుకి చదువు అబ్బలేదు. ఆరుశాస్త్రాలలో ఉద్దండులయిన పండితులు ఉన్న ముంగండ అగ్రహారంలో, ఇరవై ఏళ్ళు వచ్చిన తాను ఒక్కడే, ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది .దూర దేశానికి వెళ్లయినా సరే, పిలక్కి తాడు కట్టుకుని అయినా సరే( నిద్ర మానుకుని కష్టపడటం అనేందుకు ఈ ఉపమానమ్... నిద్ర పొతే, తూలి , పిలక్కి ఉన్న తాడు వెనక్కి లాగడంతో మెలకువ వస్తుంది కదా...) మహా పండితుడయ్యి తిరిగి రావాలని సంకల్పించాడు .

దూర దేశానికి వెళ్లి, ఒక సత్రంలో బస చేసి, తోటి ప్రయాణికుడిని ' అయ్యా! నన్ను ఆరు మాసాల్లో పండితుడిని చెయ్యగల గురువు కావాలి,' అని అడి గాడు .

'ఓ లేకేం, నేను విద్య నేర్పిన శిష్యులు అంతా ఇప్పుడు రాజాస్థానాల్లో కొలువు చెస్తున్నారు. మరి, గురుదక్షిణ ఏమి ఇస్తావ్ ?' అని అడిగాడు ఆ గురువు.

' నా బంగారు మురుగులు ఇస్తాను. గురువర్యా! వెంటనే నాకు విద్య నేర్పండి,' అంటూ సాష్టాంగ పడ్డాడు జొగులు.

'నీకు శబ్దాలూ, సంధులూ వచ్చునా?'

'వాటిల్తోనే అసలు చిక్కండీ . సంధులూ- సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా?'

'అసలు వాటితో అవసరం లేకుండా పండితుడిని చెయ్యడమే నా ప్రత్యెకత. శత శ్లోకేన పండితః ' అన్నారు పెద్దలు. అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితుడు అవుతాడని శాస్త్రమ్...



"గురువుగారు, మరీ వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం . కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా?" దీనంగా అడిగాడు జోగులు .

" తగ్గకేమి? చతుః శ్లోకేన పండితః " , అన్నారు శాకటాయనుల వారు. అంటే, నోటికి నాలుగు శ్లోకాలు వచ్చిన వాడు కూడా పండితుడే,"

"అయితే, నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు," అంటూ మురిసిపోయి, విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు .

నాలుగు నెలల తర్వాత గురువుగారు 'పండితుడివయి పోయావు, ఇక నీకు తిరుగు లేదు పో,' అంటూ సెలవిచ్చారు. వెంటనే జోగులు తన వేలికున్న బంగారు ఉంగరం అమ్మి, కాశ్మీరు శాలువా భుజాల నిండుగా కప్పుకుని, కళ్ళు ఎగరేస్తూ, దర్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు .

దారిలో అతడికి ఒక చచ్చిన గాడిద కనిపించింది . 'అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ .. ' అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది . వెంటనే ఒక తాడు తీసుకుని, గాడిద మెడకు కట్టి, ఈడ్చుకుని వెల్లసాగాడు . అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడ సాగాడు .

వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది . "సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్..." అంటే, శరీరం అంతటిలో తలే ముఖ్యమయినది . కనుక, రంపం లాంటి కొమ్మ తీసుకుని, గాడిద తల నరికి దాన్ని తీసుకు పోసాగాడు . కాసేపటికి అది కూడా బరువు అనిపించింది .

అప్పుడు మూడవ శ్లోకం గుర్తుకు వచ్చింది . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ...' అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమయినవి. వెంటనే, సన్నటి వెదురు బద్దతో గాడిద కన్ను గుడ్డు పెకిలించి, అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు . దారిలో ఒక పలివెల అనే దేశం వచ్చింది . ఆ దేశపు రాజు పండిత ప్రియుడు అని విని, రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు .

అప్పుడు జోగులుకి నాలుగోవ శ్లోకం గుర్తుకు వచ్చింది . ' రిక్తహస్తేన నో పెయాట్ రాజానం దైవతం గురుమ్... ', రాజును, దైవాన్ని, గురువును, వట్టి చేతులతో దర్శించకూడదు . ఏదో వొకటి ఇవ్వాలి, అనుకుని, రాజు వద్దకు వెళ్లి, తన చేతిలో ఉన్న గాడిద గుడ్డును ఇచ్చాడు .

ఆ వింత వస్తువును చూసి, బెదిరిన రాజు జోగులుకి బాగా దేహశుద్ధి చెయ్యమని, నౌకర్లకు ఆజ్ఞాపించాడు . తాను ఇంత శ్రమ పడి నేర్చిన పాండిత్యం, గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లుమన్నాడు జోగులు .

అదండీ సంగతి, గాడిద గుడ్డంటే , గాడిద కన్ను గుడ్డు అన్నమాట .