ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి అయిన మేఘాలయ గత నాలుగైదు రోజులుగా వరుసగా వార్తల్లోకి వస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన షణ్ముగనాథన్ రాజ్భవన్ను తన రాసలీలలకు అడ్డాగా మార్చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరకు గవర్నర్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి ఫిర్యాదులు వెల్లాయి. చివరకు గవర్నర్ తన పదవిని వదులుకోక తప్పలేదు.
గవర్నర్ రాసలీలల వ్యవహారం ఇంకా వార్తల్లో నలుగుతూ ఉండగానే ఇప్పుడు ఆ రాష్ట్ర హోం మంత్రి డోంకుపర్ రాయ్ రేప్ వివాదంలో చిక్కుకున్నాడు. పద్నాలుగు సంవత్సరాల బాలికపై ఆ రాష్ట్ర హోంమంత్రి డోంకుపర్ రాయ్ అత్యాచారం చేశారన్న అభియోగాలు వచ్చాయి. ఇవిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
హోం మంత్రి కుమారుడు షిల్లాంగ్ లో ‘‘మార్వలీన్స్ ఇన్’’ అన్న పేరు మీద ఒక గెస్ట్ హౌస్ రన్ చేస్తున్నాడు. ఈ గెస్ట్ హౌస్లో 14 సంవత్సరాల బాలికపై నలుగురు వేర్వేరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా ఆరోపణలు వచ్చిన వారిలో మేఘాలయ రాష్ట్ర హోం మంత్రి ఒకరు కావటం గమనార్హం.
మైనర్ బాలికపై రేప్ చేసినట్టు ఆరోపణలు రావడంతో హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే హోం మంత్రి మాత్రం ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని..తాను మాత్రం తన పదవికి రాజీనామా చేసేదేలేదని చెపుతున్నారు.