ఆమె పేరు సుల్తానా బేగం. భారతదేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్కు స్వయానా కోడలు అవుతుంది. మరి చక్రవర్తి కోడలు కదా… ఏ రాజభవనంలోనో నివసిస్తుంది, అన్ని భోగ భాగ్యాలను అనుభవిస్తుంది… అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఆమె నివాసం ఉంటోంది కోల్కతాలోని ఓ మురికి వాడలో… ఓ పూరిగుడిసెలో..! అదీ… అద్దె ఇల్లు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఆరుగురు చిన్నారులను పెంచుతూ కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ఇరుగు పొరుగు ఇండ్లలో పనిచేయడం, లేదంటే బజ్జీలు, పకోడీలు వేసి అమ్మడం, వచ్చిన దాంట్లోనే తిని జీవించడం… ఇదీ ఆమె దినచర్య. 2003లో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఓ ఇంటిని అందించింది. కానీ స్థానికంగా ఉండే కొందరు గూండాలు దౌర్జన్యంగా ఆమెను ఆ ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఉన్న ఆ ఒక్క దిక్కూ పోయింది. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.6వేల ఫించన్ అందుతోంది. బాగా వృద్ధురాలు కావడంతో ఇక ఆమెకు పనిచేసే ఓపిక కూడా లేదు. ఆ ఫించన్తోనే ఆరుగురు పిల్లల సంరక్షణ బాధ్యత చూస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో ఆమె గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. మొఘల్ సామ్రాజ్య అధిపతులు కట్టించిన తాజ్ మహల్, ఎర్రకోట వంటి వాటితో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు గడిస్తున్నా వాటికి వారసులైన వారికి మాత్రం చిల్లిగవ్వ అందడం లేదు. ఇక సుల్తానా బేగంకు న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా లేదు..! చూద్దాం… మరి ఏం జరుగుతుందో..!